నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషీ ఓ పుస్తకమే..!

10 Mar 2016

గౌతమి (నా మొదటి కథ)

గౌతమి

          ‘జై ర తెలంగాణ! జై జై ర తెలంగాణా....’
 “అబ్బో!అప్పుడే వీడు హలో ట్యూన్ మార్చేశాడే! వయసు పద్నాలుగు! వీడికో ఫోను! దానికో హలో ట్యూను!!” అనుకుంటూ మా తమ్ముడు బిట్టు గాడికి మళ్ళీ ఫోన్ చేశాను. తియ్యట్లేదు. లాభం లేదనుకుని ఎస్ఎంఎస్ పెట్టాను. “ఒరేయ్ బిట్టు!నేను ట్రైన్ లో ఉన్నా.పొద్దున్నే కలుస్తా.రేపు సాయంత్రమే మళ్ళీ మన రాజమండ్రి ప్రయాణం.అన్నీ సర్దుకుని రెడీ గా ఉండు.గుడ్ నైట్!”.
బిట్టు స్వయానా మా బాబాయ్ కొడుకు.తొమ్మిదవ తరగతి పరీక్షలు రాసి సెలవులకు మా ఊరు రాజమండ్రి రావాలని వాడి కోరిక.హైదరాబాద్ వెళితే బాబాయ్ వాళ్ళనీ చూడొచ్చు, షాపింగ్ చెయ్యొచ్చు, ఎన్నో ప్రదేశాలూ తిరగొచ్చని ఎప్పుడూ మేము వెళ్ళడమే కాని వాళ్ళు మా దగ్గరకు వచ్చింది తక్కువ.బిట్టుకి నేనంటే ప్రాణం.నాకూ వాడంతే!చిన్నప్పట్నుంచి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా “అక్కా!అక్కా!” అంటూ నాతోనే ఉంటాడు.ఎప్పుడో వాడి ఆరవ ఏట వచ్చాడు రాజమండ్రికి.మళ్ళీ ఇక రేపే  వాడొచ్చేది.
           ట్రైన్ ఇక రాజమండ్రికి సెలవు చెప్తోంది. ఎప్పుడు ఈ రైలెక్కినా అందరూ మన వాళ్ళే అన్న భావన!పలకరింపు నవ్వులు, ఆప్యాయంగా “ఎక్కడి దాకండి ప్రయాణం?”, “భోం చేసే బయల్దేరారా?” అనే ప్రశ్నలు...ఎవరికైనా సామాను సర్దడంలో సహాయం చేస్తే “చల్లగా ఉండమ్మా!” అనే ఆశీర్వాదాలు...చాలా ఉత్సాహంగా ఉంటుందీ ‘కాకినాడా టూ సికింద్రాబాద్’ రైల్లో ప్రయాణం!బిట్టు రిప్లై ఇస్తాడేమో అని ఫోన్ పద్దాకా చూసుకుంటున్నా. ఈ లోగా ఒక యాభై ఏళ్ళు దాటిన పెద్దావిడ నా దగ్గరకొచ్చిoది.
“అమ్మా నీది లోయర్ బెర్తేనమ్మా?” వినమ్రంగా అడిగింది.
“అవునండి!మీకు అప్పర్ బెర్త్ వచ్చిందా?నేను తీసుకుంటాను.నెంబర్ చెప్పండి” అలవాటైన సమాధానం అలవోకగా చెప్పాను.
“అప్పుడే వద్దమ్మా!టీసి వచ్చి వెళ్ళాక వద్దువుగాని” అని ఒక నవ్వు నవ్వేసి మాయమైంది.
            చూస్తూనే కొవ్వూరు పలకరించింది నిశ్సబ్దపు చీకట్లో.కొవ్వూరు స్టేషన్ దాటీ దాటగానే టీసి వచ్చి అందరి టికెట్స్ చెక్ చేసుకుని వెళ్ళిన రెండు నిమిషాలకి మళ్ళీ ఆ అప్పర్ బెర్త్ ఆవిడ ప్రత్యక్షమైంది బ్యాగ్ తో సహా!నేనూ నా బ్యాగ్ తో ఆమె చెప్పిన అప్పర్ బెర్త్ ఎక్కి పడుకున్నాను.ఆఖరి సారి ఫోన్ చూసుకున్నాను.బిట్టు రిప్లై ఇవ్వలేదు. “సర్లే ఎటూ నేను వస్తున్నానని తెలుసు కదా!” అనుకుని ఆరు గంటలకి అలారం సెట్ చేసుకుని నిద్రకి ఉపక్రమించాను.అదేంటో!ఎన్ని వందల సార్లు ప్రయాణం చేసినా కళ్ళు మూసే సరికి హఠాత్తుగా నేనున్న బోగిలోనే మంటలు రేగినట్టు,హ్యాండ్ బ్యాగ్లో నా పర్స్ పోయినట్టు ,చేతికున్న ఉంగరమో, మెళ్ళో గొలుసో మాయమైనట్టు పిచ్చి పిచ్చి ఆలోచనలతో పడుకునేసరికి ప్రతి సారి విజయవాడ దాటాల్సిందే!అందుకే దిగేది ఆఖరి స్టేషన్ అయినా మెలకువ వస్తుందో లేదో అని అలారం పెట్టుకుని పడుకుంటాను ఎప్పడూ. అయినా అలారం మోగక ముందే గోదావరి వారసులు కాకినాడ,సామర్లకోట,రాజమండ్రి,నిడదవోలు,తాడేపల్లిగూడెం,ఏలూరు వాసులంతా ఉదయం ఐదు గంటలకే దినపత్రికల్లా మారిపోతారు కదిలే రైల్లో.అలారం అవసరం లేకుండా!
X                                              X                                              X
“అమ్మా బుజ్జీ! సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది” చటుక్కున లేచి కూర్చున్నాను! నిద్రలేపిన అంకుల్ కి “థాంక్స్ అండి” అని చెప్పి బ్యాగ్ తీసుకుని రైలు దిగాను. కూలీలంతా నా తక్కువ లగేజిని చూసి నిరుత్సాహంగా తప్పుకుంటూ నాకు దారిచ్చారు.మళ్ళీ రాత్రి బండికే ప్రయాణం కావడంచేత చిన్న బ్యాగే కాబట్టి చక చకా మెట్లెక్కి ఒకటో నెంబర్ ప్లాట్ఫారం వైపు నుండి స్టేషన్ బయటకొచ్చి ఆల్ఫా హోటల్లో ఛాయ్ తాగి ఆటో మాట్లాడుకుని దోమలగూడ లోని మా బాబాయ్ ఇంటికి చేరుకున్నాను. ఆ వీధి పిల్లలంతా రకరకాల స్కూల్ యూనిఫోర్మ్స్ లో ఆటోల్లో,బస్సుల్లో,ద్విచక్రవాహనాల్లో హడావిడిగా పాఠశాలలకి బయల్దేరుతున్నారు.గుమ్మం దగ్గరే పిన్నీ బాబాయ్ నాకోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు.
“మంచిగున్నవా బేటా?” అంటూ నా తల మీద చేత్తో నిమురుతూ ఆశీర్వదించాడు మా బాబాయి.  
“బావున్నాను బాబాయి,ఎలా ఉన్నావ్ పిన్ని?”
“మంచిగున్నా బిడ్డా!” ఆప్యాయంగా కౌగిలించుకుని లోనికి ఆహ్వానించింది పిన్ని.
లోపలికి వెళ్లి కుర్చీలో కూర్చుంటూనే “పిన్నీ!బిట్టు ఎక్కడ?” అని అడిగాను
“అగో!సానం జేస్సున్నడమ్మా!ఇయ్యాల్తోని ఇస్కూల్ ఖతమైతదని జెప్పిండు.పరీక్ష అయితే మంచిగ రాయాలె గదమ్మ!గది తెలుస్తలేదు బద్మాష్ గాన్కి. ‘రేపక్కొస్తది రాజవండ్రి పోవాలె!’ దినాం గిదే లొల్లి!” వేడి వేడి చాయ్ ఇస్తూ సహజంగానే కటువుగా ఉండే స్వరంతో సమాధానమిచ్చింది పిన్ని.
“చిట్టీ!ఉస్మానియా బిస్కెట్లు తింటవా అమ్మ?” చేతికందిస్తూ అడిగింది పిన్ని.
“వద్దు పిన్నీ!తర్వాత తింటాను”
“ఏందమ్మా?అంతా పరాయోల్ల లెక్క జేస్తవు! మీ నాయన కొలువు చేస్కోనికి హైద్రవాద్ ని ,మా అందర్నీ ఒద్లి పెట్టి పొయ్యిండు.నువ్ జూస్తె మొత్తం ఆంధ్రోల్ల లెక్కనే పెరిగినవ్!గిది నీ ఇల్లు బేటే!గా బిట్టు గాడు నీ తర్వాతనే గద!నువ్వే నా పెద్ద బిడ్డవు!తిను మంచిగ తిను” అంటూ బిస్కెట్లు నా నోట్లో పెట్టబోయాడు బాబాయి.
ఎన్ని ఏళ్ళు గడిచినా చిన్నప్పుడు ఎత్తుకు పెంచిన మమకారం ఏ మాత్రం తగ్గలేదు బాబాయికి.
“బాబాయి!నేనింకా బ్రష్ చేయలేదు” ఆయన చెయ్యినెడుతూ అన్నాను.
“ఆ!చాల్ చెయ్యిగ!మొకం కడగకుండ ఛాయ్ తాగినవ్ బిస్కెట్లు తింటే ఏమైతది...?”
“అయ్యో!వద్దు బాబాయి.ఇంతకీ నువ్వు ఆఫీస్ కి తయారవ్వట్లేదేంటి?”
“ఆ!రేపియ్యాల పోతలేన్మా. యెన్క గల్లీల గనేష్ కాకున్నడు గద!? ఐన పెద్ద బిడ్డె...(గడ్డం గోక్కుంటూ) గదె...పెద్దమనిషైంది. గాడనే ఉండాలే. గందుకే పోతలేను. పిన్ని తోని రా జర షేపైనంక. మంచిగుంటది!”
“వాళ్లమ్మాయి ఫంక్షన్ కి నువ్వెందుకు బాబాయ్ రెండ్రోజులు సెలవు పెట్టడం?డబ్బులు దండగ కాకపోతే!? అదే నాన్నైతే చచ్చినా పెట్టడు!ఆలోచించీ ఆలోచించీ సగం రోజు సెలవు పెట్టాడు నా ఫంక్షన్ కే!”  
“అక్కా!ఎప్పుడొచ్చినవే?” అరడజను ఇళ్ళకి వినబడేలా అరుచుకుంటూ వచ్చాడు బిట్టు.
“ఇందాకే రా! బావున్నావా?” వాడి బూరెల్లాంటి బుగ్గలు నొక్కుతూ అడిగాను.
రెండు చేతులూ జోడించి “ఆ బాగున్నమండి!మీరు బాగున్నారా అండి?పెద్దమ్మ పెద్నాన్న బాగున్నారా అండి?” కళ్ళు రెప రెపలాడిస్తూ నా యాసని అనుకరిస్తూ ముద్దు ముద్దుగా అడిగాడు బిట్టు గాడు.
“చాల్లేరా!వెళ్లి రెడీ అవ్వు!టైం అవుతున్నట్టుంది” అన్నాను గడియారం చూస్తూ.వాడు మళ్ళీ లోపలికి పరుగు తీసి ఒక్క క్షణంలో వచ్చాడు.
“అక్కా! ఇగో దోష తిన్పియ్యే!” అంటూ ప్లేటు నా చేతిలో పెట్టాడు. వాడు నేనున్నన్ని రోజులు మూడేళ్ళ బాలుడైపోతాడు.నా కోసం స్కూల్ మానేస్తాడు.ఏడాదంతా జరిగిన విషయాలు చెప్తాడు.అన్నం నేనే తినిపించాలంటాడు.నాకేం కావాలన్నా చేసిపెడతాడు.బహుశా ఇద్దరం ఏక సంతానం కావడం వల్లనేమో అంతటి అనురాగం!ఇవన్నీ ఆలోచిస్తూ బిట్టుగాడి మాటలు వింటూ దోశలు తినిపించేశాను.ప్లేటు పిన్ని చేతికిచ్చి చేతులు కడిగాను.
“అక్కా! జల్ది రా!స్కూల్ టైం అయితుంది.” పిన్ని వాడే స్కూటీ తాళాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బిట్టు.పిన్ని చూడనే చూసింది.
“ఒరె వారీ!ఏం రా?నఖ్రాలు షురు జేష్ణావ్ మల్లా?రాత్రికి వోతున్నావ్ గద రా!ఇంకేంది?సప్పుడు జెయ్యకుండ పొయ్యి ఇస్కూల్ బస్ ల కూసో పో!”పిన్ని కాస్త కోపంగానే అంది.
“ఐమె అట్లనె అంటది నువ్ రాక్కా!” నా చేయి లాగాడు బిట్టు.
పిన్ని మొహం ఎర్రబడింది!పెను ప్రమాదం ముంచెత్తనుందని అర్ధమైంది బిట్టుకి.వెంటనే ముఖం మాడ్చుకుని నాకు ‘టాటా’ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు.నేనూ వాడికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పలేకపోయాను పిన్ని ధాటికి జడిసి! నేను ప్రయాణం చేసొచ్చి కనీసం స్నానాలు జపాలు చెయ్యకుండా స్కూల్ కి దింపే పని పెట్టడం పిన్నికి ఇష్టం లేదని నాకూ తెలుసు!!
                                          X                                       X                                            X
“ '' కారానికి ,, లు అనేటివి పరమైనప్పుడు వాటికి క్రమంగ ,, అర్ లు ఒస్తై!గిది గున సందైతది! ఉదాహర్నకు ఉషోదయము- ఉష+ఉదయము!”
బిట్టు క్లాస్ రూమ్ బయటే నిలబడి ఉన్నాను!వాడికి సర్ప్రైస్ ఇద్దామని!ఇవ్వాల్టి సోషల్ పరీక్ష అయిపోయాక మొదటి రోజు జరిగిన తెలుగు పరీక్ష లో వచ్చిన సందేహాలు తీరుస్తోంది పంతులమ్మ.ఇంతలో బెల్ మోగడంతో ఒక్క సారిగా క్లాస్ రూముల్లోంచి బయటకు దుసుకొచ్చారు పిల్లలంతా...పదులు పదులుగా మొదలై వందలమంది పిల్లలు ఒకే రంగు బట్టలతో లేడి పిల్లల్లా సంతోషంతో పరుగులు పెడుతున్నారు.ఇవాళ ఆఖరి పరీక్ష.రేపట్నుంచీ సెలవులు!ఇక ఎవరాపగలరు ఈ ఉత్తేజాన్ని!!వాళ్ళందరినీ చూస్తూ నా పక్కనే ఉన్న బిట్టుని గమనించలేకపోయాను!
“రేయ్!ఎప్పుడొచ్చావు రా?” వాడ్ని కిందకి పైకి చూస్తూ అడిగాను.
“ఏందే అంత గనం ఎం జుస్సున్నవ్?ఎప్పుడు జూడలే పోరల్ని?”
“ఆ!చూళ్ళేదు రా!పద వెళదాం”
“కం రే!వి విల్ గో!” వాడు ఇరు వైపులా ఇద్దరి ఫ్రెండ్స్ భుజాల మీద చేతులు వేసి నడక ప్రారంభించాడు.
స్కూల్  బయటకొచ్చి ఆటో కోసం చూస్తున్నాం. తమ్ముడి చేయి పట్టుకుని ఎదురు చూస్తున్న నన్ను చూసి ఆటోలు రావడం...నేను దోమలగూడ అనగానే రానని వెళ్ళిపోడం!
మళ్ళీ ఎదురుగా ఓ ఆటో ఆగింది. ఈ సారి ఎలాగైనా ఈ ఆటో ఎక్కాల్సిందేనని ముందే నిర్ణయించేసుకున్నాను!
“కాజానాయే మెడామ్..?”
“దోమల గూడ...గగన్ మహల్ కే పాస్” అన్నాను తత్తరపడుతూ.
“ఏమిస్తవ్ మెడం?” నా ‘ఆంధ్ర’ హిందీ వినగానే తెలుగులోకి దిగుతూ అడిగాడు ఈ సారి.
“ఫిఫ్టీ”
“అరె!నయ్ ఆతా మేడమ్ ఒంద రూపాలియ్యుoడ్రీ!”
“అబ్బెబ్బే!వంద రూపాయిలా?సిక్స్టీ కొస్తేరా!లేతే లేదు”
“క్యా అబ్బెబ్బే మేడమ్!నైన్టీ కొస్తవా?” పళ్ళిక్కిలిస్తూ అడిగాడు
“లేదు. ఫిఫ్టీ నే!”
“అరే!మల్ల ఫిఫ్టీ కాడ కొస్తవేందవా? షిక్ష్టీ కొచ్చేషేయ్!”
‘సరే’ అనక తప్పలేదు.       
బిట్టు వాడి బస్ ఫ్రెండ్స్ అందరికీ రాత్రి రాజమండ్రి వెళ్తున్నట్లు చెప్పి వదల్లేక వదల్లేక వచ్చాడు.దారంతా ఏవేవో ప్రశ్నలు కబుర్లు.వాడి మాటలకు అంతే ఉండదు!

                                X                                 X                                    X                                    X
“గిదేందే తల్లీ! ఇప్పుడే రాజమండ్రిల ఉన్నట్లుంది!”
ట్రైన్ లో జనాల సంభాషణలు వింటూ అడిగాడు బిట్టు.ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ దాటుతోంది.
“హహ్హ! మరి రాజమండ్రికే కద రా రైలెల్లేది.అందరూ గోదావరి జిల్లాల వాళ్ళే ఉంటారు.”
“ఏందో ఏమో!” ఎదురుగా పులిహోర పొట్లం విప్పుకుని తింటున్న పెద్దాయన్ని విచిత్రంగా చూస్తూ అన్నాడు.
           టైం పదింపావు  దాటుతోంది.బిట్టుకి నిద్ర రావడం గమనించి వాడి మిడిల్ బెర్త్ మీద బెడ్ షీట్ పరిచి సిద్ధం చేశాను.నాది మళ్ళీ లోయర్ బెర్తే.ఎవరైనా అప్పర్ బెర్త్ వాళ్ళు అడుగుతారేమో అని ఎదురుచూస్తున్నాను.రైలు మెల్లగా ఆగింది.కిటికీలోంచి చూశాను.వరంగల్ స్టేషన్ అది.కిందటి ఏడాది ఇక్కడే అనూహ్యంగా పెద్ద పెద్ద రాళ్ళు కిటికీల్లోంచ్చి చొచ్చుకుపడ్డాయి.అప్పుడు నా పక్కనే కూర్చున్న ఓ మధ్య వయస్కుడి తల పగిలింది!కిటికీ దగ్గరలో కూర్చున్న వాళ్లందరి మీదా కిటికీ అద్దం పెంకులు ముక్కలు ముక్కలుగా పడ్డాయి. “నిండు గర్భిణీ అయిన ఓ తెలంగాణా తల్లికి కాన్పు చెయ్యం అని ఆమెను కర్నూల్ ఆసుపత్రిలో మెట్ల మీద నుంచీ తోసేశారుగా!ఈ మాత్రం రాళ్ళు పడతాయండీ మరి!!” అన్నారు అప్పుడెవరో...చేదు జ్ఞాపకాలను వెనక్కినెడుతూ రైలు ముందుకి కదిలింది.ఇక ఎవరూ రారని నిశ్చయించుకుని అలారం ఐదున్నర కి సెట్ చేసుకుని పడుకున్నాను.
          సరిగ్గా నిద్ర పట్టక ఐదింటికే లేచి కూర్చున్నాను.నా ఎదురు బెర్త్ లో పెద్దాయన “గుడ్ మార్నింగ్” అన్నట్టుగా చిరునవ్వు ఇచ్చాడు.
“ఎక్కడ దిగుతావమ్మ? కాకినాడా?” నేనూ నవ్విన వెంటనే అడిగాడు.
“లేదండి!రాజమండ్రి”
“ఓహో!రాజమండ్రిలో ఎక్కడమ్మా?మా చెల్లెలి గారిది కూడా రాజమండ్రే!”
“ఇన్నీసుపేటండి.గూడెం దాటినట్టుందే!” పొగమంచుతో పచ్చని పొలాలు దాటిపోవడం గమనిస్తూ అన్నాను.
“ఆ!దాటిందమ్మ!ఒక్కదానివే వెళ్తున్నావమ్మా?”
“లే! నేన్ భీ ఒస్సున్న!” పై నుండి తొంగి చూస్తూ అన్నాడు బిట్టు!
“వీడెప్పుడు లేచాడు!?మా తమ్ముడండి!”వాడ్ని చూపిస్తూ అన్నాను ఆయనతో.
రైలు గోదావరి బ్రిడ్జి ఎక్కుతోంది. ఆ మూడ్నిమిషాల హోరు వేరుగా ఉంటుంది.
“అక్కా! ఆ సౌండ్ ఏందే గట్లొస్సుంది? ఏమైతుంది?” కంగారుగా అన్నాడు బిట్టు.
“తప్పు బాబు! పెద్దవాళ్ళని అలా అమర్యాదగా మాట్లాడకూడదు. అక్క కదా!” కాస్త కళ్ళెర్ర జేసినట్టే అన్నాడు ఆయన.
“ఏమంటుoడే?” అమాయకంగా ముడి పడ్డ భ్రుకుటితో అడిగాడు బిట్టు.
ఫక్కున వచ్చే నవ్వుని పంటి కింద నొక్కి పెట్టి
“ఏం లేదు రా! గోదావరి చూద్దువు గాని కిందకి రా” అని పిలిచాను.
వాడు కిందకొచ్చి మిడిల్ బెర్త్ కిందకి తీసి కూర్చున్నాడు. నిండు గోదావరిని చూడగానే ఆశ్చర్యంతో, కొద్దిగా భయంతో వాడి కళ్ళు పెద్దవైయ్యాయి! రైలు రెండు వైపుల కిటికీల్లోంచి మార్చి మార్చి చూస్తున్నాడు!
“ఏందే ఇంత గనం నీలు!! ఏడికెల్లొచ్చినయే తల్లీ!” కిటికీలో మొహం పెడుతూ అన్నాడు బిట్టు  
ఎదురుగా ఉన్న పెద్దాయన తన గుప్పిట్లో చిల్లర పట్టుకుని మనసులో ఏదో స్మరించుకొని నదిలోకి విసిరాడు.
బిట్టు తదేకంగా చూస్తున్నాడు.
“నువ్వు కూడా వేస్తావేంట్రా?” అని నా బ్యాగ్లోంచి రెండు రూపాయల బిళ్ళ తీసిచ్చాను.
“ఏందీ!దిమాక్ గిట్ల ఖరాబైందా? బూమర్ కొన్కుంట ఇక్కడీ!” అని నా చేతిలోంచి బిళ్ళ లాక్కుని వాడి జేబులో పెట్టుకున్నాడు.
ఆ పెద్దాయన కి వీడి భాషా, చేష్టలు చాలా చిత్రంగా అనిపిస్తున్నాయి. రైలు గోదావరి నది, పుష్కరాల రేవు, శివలింగం దాటి ఊర్లోకి వస్తోంది. రైల్లోంచే మా ఇంటికి దారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను బిట్టు కి. గోదావరి స్టేషన్ దాటి రాజమండ్రి రాగానే రైలు దిగి స్టేషన్ బయటకు వచ్చాం. బిట్టు అంతా పరిశీలిస్తున్నాడు.
“అక్కా! ఈడ స్టేషన్ ల కూలీలే లేరెంది?హైదరాబాద్ ల మస్తు మందున్నరు గద!”
“ఇక్కడెక్కువ ఉండరు రా! హైదరాబాద్ కంటే చిన్న ఊరు కదా!”
“ఆయ్!! అలాగండి! హిహ్హిహ్హి” చిలకలా నవ్వాడు బిట్టు.
ఇంతలో ఓ ఆటోడ్రైవర్ వచ్చాడు.
“మేడం గారు! ఎక్కడికెళ్లాలండి?” ఎక్కేది ఇద్దరే అని అర్ధం చేసుకుంటూ అడిగాడు.
“దానవాయిపేట”
“ఓ ఎనభై రూపాయిలివ్వండి” బేరం పాట మొదలుపెట్టమన్నట్టుగా అడిగాడు డ్రైవర్.
“వద్దులే వెళ్ళు బాబు” అతడి ఆశల మీద నీళ్ళు చల్లాను.
“ఏమిస్తారో చెప్పండి మేడం గారు”
“యాభై!”
“దానవాయిపేట పక్కనే లేదు కదండీ! మళ్ళీ వెనక్కి ఖాళీగా రావాలి. డెబ్బై ఐదు చేస్కొండి మేడం గారు”
“నువ్వు ఖాళీగా వస్తే నేను డబ్బులివ్వాలా?వద్దు వెళ్ళు”
వేరే ఆటో రావడం చూశాడు డ్రైవర్. ఒకవేళ మేం ఆ అటోలో వెళ్లిపోతామేమో అనుకుని మా బ్యాగులు అతని ఆటోలో పెట్టేసి
“ఎక్కండమ్మా!డెబ్బై ఇచ్చేయండి” అనేశాడు.
బిట్టు గాడు ఉండడం వల్ల ఎక్కువ వాగ్వాదానికి దిగలేదు. ఎక్కేశాము!ఎక్కిన వెంటనే బిట్టుగాడి మొదటి ప్రశ్న-
“అక్కా!రైల్ల అయినకి పిన్నీసు పేట అని ఏమో చెప్పినవ్ గదనే?”
“హిహ్హి!పిన్నీసు కాదురా ఇన్నీసు పేట!”
“హా!గదే!”
“ఆ! మరే!? ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్, బ్యాంకు ఎకౌంటు నెంబర్ అన్నీ చెప్తారు!!”
“మస్తు షానున్నవ్ అక్కా!” భుజం మీద తడుతూ అన్నాడు.
దారి పొడుగునా స్కూల్స్, హాస్పిటల్స్, కరీ పాయింట్లు,బట్టల షాపులు అన్నీ చూస్తున్నాడు. ప్రతిదీ వివరంగా చెప్తున్నా. మాటల్లోనే ఇల్లొచ్చేసింది. ఆటో దిగి యాభై  రూపాయలిచ్చాను. డ్రైవర్ ఖంగు తిన్నాడు!
“ఏంటండీ! మేడంగారు?డెబ్బై అన్నారు కదా!”
“నేనెక్కడన్నాను?” కళ్ళెగరేస్తూ అన్నాను.
“సరే ఇంకో పదన్నాఇవ్వండి” నిట్టూర్చాడు.
పది రూపాయలిచ్చి ఇంకో పది గెలిచానన్న గర్వంతో లోపలికి నడిచాను బిట్టుతో పాటు.
X                                                 X                                            X                                        X
         సాయంత్రం ఐదున్నర కావస్తోంది.బిట్టుని వెనుక కూర్చోబెట్టుకుని నా స్కూటీ పై గౌతమి ఘాట్ కు తీసుకువెళ్తున్నా. తక్కువ జనం,కాలుష్యం లేని గాలి,ప్రశాంతమైన రోడ్లు, పెంకుటిళ్ళు, స్త్రీలు,యువతులు ఎక్కువగా చీరలూ సల్వార్ కమీజ్ ల్లోనే కనబడడం, ప్రతి వీధిలో ఓ పిడత కింద పప్పు బండి,చిలక జ్యోతిష్యం,కాషాయ వస్త్రాలలో విదేశీ భక్తులు సాధువులు, అన్నిటినీ చూస్తున్నాడు బిట్టు. ముఖ్యంగా గోదావరి మాటల్ని!
         వచ్చేటప్పుడు అమ్మ కొబ్బరన్నం చేయడానికి కొబ్బరికాయ,పచ్చిమిర్చి,కర్వేపాకు ఇంకా ఏవో తెమ్మని చెప్పింది. దార్లో కనిపిస్తాయేమో అని పక్కన చూసుకుంటూ వెళ్ళడం వల్ల ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ని గుద్దేసాను! రెండు బళ్ళకి ఏమీ కాలేదు కాని నా గుండె కొట్టుకోవడం ఒక్క క్షణం ఆగినట్టైంది!
“ఓయ్!ఏం వా?కండ్లు కన్పిస్తలే?సీద ఒచ్చి మా బండిని గుద్దినవ్!?మా అక్కకి ఏమన్న దెబ్బ తాకితే ఏం జెయ్యాలే?”బండి దిగి మోటార్ బైక్ పై ఉన్న సుమారు పద్దెనిమిదేళ్ళ అబ్బాయి మీద విరుచుకుపడ్డాడు బిట్టు గాడు.
అయ్ బాబోయ్ భలేటోరే!ఇది మరీ బా ఉంది. జార్తగా మాటాడండి! విడే చూస్కోకుండా నా బండి గుద్దేహేరండి బాబు!” యదార్ధంగా చెప్పాడు ఆ అబ్బాయి.
 “బాబు!నువ్వెళ్ళమ్మా!నేనే చూస్కోలేదు” సర్ది చెప్పి ఆ అబ్బాయిని పంపేసాను.
“అరే! ఏందక్క అట్లా జేష్నవూ!?గిదే మన హైదరాబాద్ ల అయితే పోలిసోల్తోని మెత్తగొట్టిపిస్తుండే!ఈడ ఓలు కన్పిస్తనేలేరు!”
“సర్లే రా!” వాడి మాటలు పట్టించుకోకుండా ముందుకి కదిలాను.
         ఎదురుగా రామాలయం బైట కొబ్బరికాయలు కనబడుతున్నాయి. ఇద్దరం వెళ్లి కొబ్బరికాయలు కొనుక్కుని బండి మీద ముందుకి సాగాం.
‘ఇదిగో భద్రాద్రి...గౌతమి అదిగో చూడండి...ముదముతో సీతా ముదిత లక్ష్మణులు...’ వెళ్ళే కొద్దీ పాట సన్నగా వినిపిస్తూ వాహనాల శబ్దాలో మాయమైంది.
          మార్కండేయ గుడి ఎదురుగా గోదావరి గట్టు మీద బండి పార్క్ చేసి ఒక ఇరవై మెట్లు దిగి స్టీమ్ బోటు ఎక్కాం. బిట్టు కి మాటలు రావడం లేదు. అంత పెద్ద నది...దాని పై పడవల్లోంచి పెద్ద పెద్ద వలలు చేపల వేటకు విస్తారంగా పరుచుకుంటున్నాయి. అందంగా సూర్యాస్తమం! నీళ్ళలో బోటు షికారు...సంధ్యాకాశంలో పక్షులు, విమానాలు, ఎదురుగా రోడ్ కం రైల్వే బ్రిడ్జి లో పైన లారీలు,బస్ లు,స్కూటర్లు , కింద రైళ్ళు తిరగడం ఆ కింద నీళ్ళలో పడవలు..ఒకేసారి మూడు వేర్వేరు రవాణా సాధనాలని చూసి ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు బిట్టు.
            “ఏమన్న ఉన్నదా అక్క!మమ్మొస్తే పరెషానైతది మీ గోదావరి జూషి! ఖతర్నాక్ ఉంది” వాడి కళ్ళు గోదావరి వంతెననీ, నదినీ తప్ప దేన్నీ చూడనంటున్నాయి. గోదావరికి ‘టాటా’ చెప్పేసి ఇంటికి బయల్దేరాం.
            దార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోవాలని మాత్రం మర్చిపోలేదు నేను! సగం దూరం వెళ్ళాక రోడ్డుకి అవతల వైపు ఒక ముసలమ్మ బుట్టలో కొన్ని ఆక్కూరలు, మిర్చి, నిమ్మకాయలు అమ్మడం చూసి బండి ఆపాను.
          బిట్టు గాడు బండి దిగి “నువ్వీడనే ఉండక్కా!నేను పొయ్యి తెస్సా” అంటే వాడి చేతికి పది రూపాయలిచ్చి “ఐదు రూపాయలకి పచ్చిమిర్చి, ఐదు రూపాయలకి కొత్తిమీర” అని చెప్పాను.
వాడు జాగ్రతగా డివైడర్ దాటి ఆ ముసలమ్మ దగ్గరకు వెళ్ళాడు.
“ఓ అవ్వ!ఐదు రూపాల్ మిర్పకాయలు ఇంకా ఐదు రూపాల్ కోత్మీరియ్యి!”
“ఏటి బాబు?”ఈ భూమ్మీద ఎప్పుడూ వినని మాటలు విన్నట్టు అయోమయంగా అడిగిందామె.
రోడ్డు చిన్నదే అవడంతో వారి సంభాషణ కొద్దో గొప్పో వినబడతూనే ఉంది నాకు. బిట్టు నాలుగైదు సార్లు చెప్పినా ఆమెకు అర్ధం కాలేదు. ఇక ఇది అయ్యేపని కాదని నేనే రంగంలోకి దిగాను.
“ఐదు రూపాయలకి పచ్చిమిర్చి, ఐదు రూపాయలకి కొత్తిమీర ఇవ్వమ్మా” అన్నాను వెళ్లి.
“ఆహా! మిరగ్గాయలమ్మా!! ఈ బాబు మాటాడేదేటీ బుర్రకెక్కలేదమ్మా!” అమాయకపు బోసి నవ్వుతో అంది ముసలమ్మ.
X                                                   X                                                X                                  
            బిట్టుకి కడియం పూల తోటలు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి, గౌరిపట్నం చర్చి, పాపికొండలు, పట్టిసీమ, కోరుకొండ, రాజమండ్రి ఎయిర్ పోర్ట్, మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియా అక్కడి బొంగు చికెన్, అంతర్వేదిలో నది సముద్రంలో కలిసే అన్నా చెల్లెళ్ళ గట్టు, ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, కాకినాడ కాజా, రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ స్పెషల్ రోజ్ మిల్క్, గంగరాజు పాలకోవా...దాదాపు అన్నీ రుచులు తినిపించాను. చుట్టు పక్కల ప్రాంతాలన్నీ చూపించాను. పదిహేను రోజులు నిర్విరామంగా గడిపాం. వాడి ఫోన్ కెమెరాకు విశ్రాంతి లేదు! వాడి ఆనందానికి అవధుల్లేవు! కాని ఇంతలోనే వాళ్ళమ్మ ఫోన్ తో నీరుగారిపోయాం.టెన్త్ సమ్మర్  స్పెషల్ క్లాసెస్ మొదలవుతున్నాయి రమ్మని!
       బిట్టు గాడి కంటే నాకెక్కువ బాధగా ఉంది. ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా గడిపాం.ఒకే తల్లికి పుట్టకపోయినా ఒకే వృక్షానికి కాసిన కాయలం కదా! ప్రాంతాలు వేరైనా, దూరంగా ఉంటున్నా వాడు నా ఒక్కగానొక్క తెలంగాణా తమ్ముడు. వాడి తండ్రిదీ నా తండ్రిదీ ఒకే రక్తం! ఇంకొన్ని రోజులు ఉంటాడేమో అనుకున్నాను. ఇంత త్వరగా వెళ్లిపోతాడనుకోలేదు! వాడ్ని వదల్లేను. వాడితో బాటూ వెళ్ళలేను! నాకు హైదరాబాదీ బిర్యానీ కావాలి రాజమండ్రి ఊరగాయా కావాలి! ఏది వదులుకోగలను? కానీ ఇది వాడి భవిష్యత్తుకీ, అభివృద్ధికీ ముఖ్యమైన దశ! వాడు వెళ్ళాలి. ఎదగాలి! కష్టపడాలి!ఎన్నో మెట్లు ఎక్కాలి!ఎన్నో విజయాలు చూడాలి. వాడిప్పుడే పదవ తరగతిలో అడుగుపెడుతున్నాడు. ఇంకా చదవాల్సింది ఎంతో ఉంది!జీవితం లో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి!వేలు పట్టి నడిపించడానికి ఈ అక్క ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్న భరోసా ఇచ్చి బిట్టుగాడ్ని మొదటిసారి ఒంటరిగా రైలెక్కించి వాడి ప్రయాణం సజావుగా సాగాలని మనసారా కోరుకుంటూ కన్నీళ్ళతో నా ఇంటికి నేను వెళ్ళిపోయాను…
                                                                                      - మానస ఎండ్లూరి
                                                                                                           April 2015, విహంగ అంతర్జాల పత్రిక

http://vihanga.com/?p=14543#sthash.K07f6EM7.dpbs








1 comment: